- దిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో ప్రధాని మోదీ, పవన్ సరదా సంభాషణ
- ఏపీలో కూటమి సమన్వయంతో ముందుకెళ్తోందని పవన్కల్యాణ్ స్పష్టం
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తో ప్రధాని మోదీ సరదాగా మాట్లాడారు. పవన్కల్యాణ్ ఆధ్యాత్మిక వస్త్రధారణను చూసిన మోదీ ‘ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? కానీ మీకు ఇప్పుడే వెళ్లే సమయం కాదు. ప్రజల కోసం ఇంకా పనిచేయాలి’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పవన్కల్యాణ్ మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి సమన్వయంతో ముందుకెళ్తోందని పవన్కల్యాణ్ తెలిపారు. తనకు వెన్నునొప్పి కారణంగా కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేకపోయినప్పటికీ, ప్రభుత్వ హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సమస్యల మధ్య హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.





