- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై విచారణ
- హైకోర్టు ఆదేశాలతో చివరకు పోలీసుల ఎదుట హాజరు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్బాబు ఆయనను విచారిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వైకాపా అనుకూలంగా రూపొందించిన ‘వ్యూహం’ చిత్ర ప్రచారం సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్పై వివాదాస్పద పోస్టులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. మద్దిపాడు మండల తెదేపా ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నోటీసుల తర్వాత విచారణ
ఈ కేసులో గతంలోనే పోలీసుల నోటీసులు పంపినా వర్మ గైర్హాజరయ్యారు. సినిమాల పనిలో ఉన్నానని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ అనుమతి లేకుండా విచారణకు రాకపోవడంతో, ఆయన అరెస్టుకు పోలీసులు రంగంలోకి దిగారు. అప్పట్లో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న వర్మ, కేసు రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడమే కాకుండా, విచారణకు హాజరై సహకరించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు పంపగా, చివరకు వర్మ నేడు విచారణకు వచ్చారు. విచారణకు ముందు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.





