కాంగ్రెస్ పార్టీతోనే భారత రాజ్యాంగ పరిరక్షణ సాధ్యం.. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ ఇందౌర్లో నిర్వహించిన ‘జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్’ భారీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ముఖ్యమైన యుద్ధమని అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ, దీనికి ప్రతిఘటనగా రాహుల్ గాంధీ అగ్రభాగాన నిలిచారన్నారు. బ్రిటిష్ కాలంలో మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లే, నేడు రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు.
రాహుల్గాంధీతో కాంగ్రెస్ నేతల ఐక్యం
ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. సభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ, ఇది కేవలం ఎన్నికల ర్యాలీ కాదని, రాజ్యాంగాన్ని రక్షించాలనుకునేవారికి, దాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరిగే యుద్ధం అని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడంలో రాహుల్గాంధీకి కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉందన్నారు. రేవంత్రెడ్డి ఈ యుద్ధాన్ని ‘గాంధీ పరివార్’ మరియు ‘గాడ్సే పరివార్’ మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ గాంధీ పరివార్కు ప్రతినిధిగా, నరేంద్ర మోదీ గాడ్సే పరివార్కు ప్రతినిధిగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధంలో విజయానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కీలకమని స్పష్టం చేశారు.






