విశాఖపట్నం వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ (వివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్)ను ప్రభుత్వం ఆమోదించిందని, కేంద్రం అనుమతి రాగానే పనులు మొదలుపెడతామని ఆయన చెప్పారు.
విశాఖలో 46.3 కి.మీ మేర మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం.. రూ.11,498 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు
విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును చేపడుతోంది. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే, విశాఖ వాసులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మెట్రో రైలు నిర్మాణం సాధ్యం కాదని మంత్రి నారాయణ తెలిపారు. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో, అక్కడ మెట్రో రైలు ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని ఆయన చెప్పారు. ఆ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే, అనకాపల్లి పారిశ్రామిక ప్రాంతాలకు మెట్రో అనుసంధానం చేస్తామన్నారు.





